తెలంగాణ కీర్తిని చాటేలా ఉత్సవాలు.. నిధులు విడుదల

by GSrikanth |
తెలంగాణ కీర్తిని చాటేలా ఉత్సవాలు.. నిధులు విడుదల
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు ప్రభుత్వం రూ.105 కోట్లు విడుదల చేసింది. 21 రోజులపాటు ఘనంగా నిర్వహించాలని అందుకు సంబంధించిన ఖర్చులకు కలెక్టర్లకు నిధులు విడుదల చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. సచివాలయంలో గురువారం రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కార్యచరణపై మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ముఖ్యమంత్రి సలహాదారులు, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, సీఎంవో కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, డీజీపీ, జిల్లా ఎస్పీలు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. స్వరాష్ట్రంగా ఏర్పడ్డ అనతికాలంలోనే తెలంగాణ దేశం గర్వించేలా అభివృద్ధి చెందిందని అన్నారు. పదేళ్లలో తెలంగాణ సాధించిన ప్రగతి ప్రస్థానాన్ని.. అమరుల త్యాగాలు గుర్తు చేసుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ఘనకీర్తిని చాటిచెప్పేలా.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు, పండుగ వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రోజు వారి కార్యక్రమాల గురించి, ఏ రోజు ఏ కార్యక్రమం చేపట్టాలో కలెక్టర్లకు సూచించారు. గ్రామాలు, నియోజకవర్గ, జిల్లాల వారిగా చేపట్టాల్సిన కార్యక్రమాలను వివ‌రించారు. మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. 21 రోజులపాటు దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు.

ఇవి కూడా చదవండి: రాష్ట్రపతికి వర్తించే నియమం గవర్నర్‌కు వర్తించదా? తమిళిసై సంచలన వ్యాఖ్యలు

Next Story

Most Viewed